Smash the Patriarchy కార్యక్రమంలో రాహుల్ గాంధీ మనుస్మృతి పై మాట్లాడాడని వేరే మతాలపై మాట్లాడటం లేదని కొందరు అనడం కనిపించింది.
ఇంకొకాయన తన తాతల ముత్తాల నుండి తమ వరకూ గొప్ప చదురులున్నారనీ వందల వేల పుస్కాలు చదివేశారనీ ఐనా ఎక్కడా మనుస్మృతి అనే పుస్తకం కనబడలేదనీ, చదవలేదనీ అన్నట్టు కూడా ఒక పోస్ట్ కనబడింది.
మనుస్మృతి అనే పుస్తకంలో ఉన్నందుకు పితృస్వామ్యం ఉందా పితృస్వామ్యం ఉన్నందుకు మనుస్మృతిలో రాయబడి అమోదించబడిందా అనేది చరిత్రకారులు తేలుస్తారు కానీ...
మన దేశంలో కులమతాలకు అతీతంగా మెజారిటీఇళ్ళల్లో ఉండే భావజాలానికి ఒక పేరు పెడితే దానికి మనుస్మ్తృతి భావజాలం అని పేరు పెట్టవచ్చు అనుకుంటాను.
భావజాలం లేదా ఐడియాలజీ అనేది ఒక పుస్తకం ద్వారా, ఒక అధికారం ద్వారా లేదా ఒక ఆదేశం ద్వారా మన మీద బలవంతంగా రుద్దబడేది కాదు. మన ఊహలు, అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆచరణలు ఏవైతే పాటిస్తున్నామో..అవన్నీ కలిపి భావజాలం అవుతుంది. అదంతా ఒక ఐడియాలజీ అనే విషయం కూడా తెలియకుండా మనం ఏదైతే పాటిస్తుంటామో దానినే ఐడియాలజీ అనాలి. మన హీరో వర్షిప్పులు, ఇళ్ళల్లో ఆడవారే వంట చేయడాలు, కట్నాలు తీసుకోవడాలు, అత్తవారింటికి అమ్మాయే వచ్చి ఉండటాలు, ఇంటి పేరు ఆడవారికి పెళ్ళయ్యాక మారడాలు, ఆస్తులు పుత్రులకే వెళ్ళడాలు, స్త్రీలను ఆబ్జెక్టిఫై చేసే సినిమాలు, స్త్రీ బలహినురాలనుకోవడాలు, ఎవరైనా స్త్రీ ఎదిగితే మరో పురుషుడే కారణమనుకోవడాలు, అమ్మాయిల చదువులకు ఏర్పడే ఆటంకాలు, భ్రూణ హత్యలు, సెక్స్ డిటర్మినేషన్ ప్రాక్టీసులు ఇలా చెబితూ పోతే ఎన్నో మన సమాజంలో చూస్తూనే ఉన్నాం.
ఇదంతా ఏదో పుస్తకంలో రాశారని , అందులో రాసినందుకే అందరూ పాటిస్తున్నారని ఎవరైనా అనుకుంటే...అది పొరపాటు.
ఎవరూ చెప్పకపోయినా చదవకపోయినా ఈ సమాజం ఇవే విలువలను మోస్తూ పోతున్నది. అదే ఆ భావజాలం. మనుస్మృతి వంటి పుస్తకాలు ఈ ప్రాక్టిసులకు లెజిటిమసీ ఇచ్చి ఉంటాయి. ఆ తరవాత అవే ప్రాక్టీసెస్ సమాజంలోకి ఇంకిపోయి ఉంటాయి. ఆ విలువలు సమాజంలో informal education లాగా నిరంతరం తరతరాలుగా ఒకరినుండి మరొకరరికి అందించబడి ఉంటాయి.
అందుకే వాటిని నిరసించాలి. అవి ఏ పుస్తకంలో ఉన్నా ఖండించాలి. అంతే కానీ మనుస్మృతిని మాత్రమే అన్నారని వాపోవడం సరైనది కాదు.