భారతదేశంలో, అంటే ఇప్పుడు మనం భారతదేశం అని పిలుస్తున్న ఈ భూభాగంలో, ఒకప్పుడు తాత్విక సంశయవాద దశ ఒకటి ఉండింది. Axial age అని మనం ఏదైతే అంటున్నామో ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐదు నాగరికతల్లో హేతుబుద్ధి వికసించడం మొదలైంది. ఐతే ఈ హేతుబుద్ధి తాత్విక మేథో జిజ్ఞాసతో నిండి ఉండింది.
అసలు ఒక వ్యక్తి ఎందుకు మేథో జిజ్ఞాసను కలిగి ఉంటాడు. ఎప్పుడు కలిగి ఉంటాడు. అని ఆలోచిస్తే ఏ కాలంలో ఐతే తన మనసు మీద ఏ మతాధికారీ లేదా మత గ్రంధం లేదా ఏ చక్రవర్తి యొక్క ప్రభావం లేకుండా ఉంటుందో అప్పుడు నిజమైన మేథో జిజ్ఞాస మనిషిలో పుడుతుంది. మనం గమనిస్తే ఉపనిషత్తులు, బౌద్ధ జైనాలు, లోకాయతం పుట్టిన ఆ యాక్సియల్ యుగంలో భారతదేశమని మనం ఇప్పుడు అంటున్న భూభాగంలో ఏ మతం కానీ మతాధికారి కానీ చక్రవర్తి కానీ లేడు. అంటే వారి ప్రభావం లేదు. అందుకే ఆ ప్రజల్లో మేథో జిజ్ఞాస సహజంగా వికసిస్తుంది.
ఋగ్వేదంలోని సృష్టి సూక్తాలు కానీ, జైన స్యాద్వాదం కానీ, బుద్దుని బోధనలు కానీ పూర్తి ఆలోచనా స్వేచ్ఛను ప్రతిఫలించాయే తప్ప దేనికో ఒకదానికి ఒక మతానికి లేదా మతాధికారి లేదా రాజుకూ లొంగి ఉన్న స్థితిలో ఉండవు. మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు బౌద్ధాన్ని అనుసరించడం వలననే వైదిక జైన బౌద్ధ చార్వాక మతాలు అన్నీ కలిసి ఉండిన పరిస్థితిని కలిగించింది. అంటే ఆలోచనా స్వేచ్ఛ ఉన్న స్థితిలో మనిషి ఆ ఆలోచనల్లో వస్తున్న కొత్త శక్తిని చూసి ప్రభావితం చెందడం ఆశ్చర్యపోవడమే ఉంటుంది కానీ ఈ కొత్త ఆలోచన తనకు ముప్పు అని కానీ దానిని అణచివేయాలని కానీ చూడడు.
ఐతే ఎప్పుడైతే రాజులు మతాలు మతాధికారులూ బలవంతంగా తయారవుతుంటారో అప్పుడు ఆలోచనా స్వేచ్ఛను అణచివేసే ఒక అవసరం ఏర్పడుతుంది. మతం ఇతర ఆలోచనలను అణచివేయడం వలననే బలపడుతుంది. స్వేచ్ఛ ఇతర ఆలోచనలను ఆహ్వానించడం వలననే బలపడుతుంది.
ఆ విధంగా చూసుకుంటే గుప్త సామ్రాజ్యం ఏర్పడేదాకా ఈ మన భూభాగం మీద ఒక తాత్విక సంశయవాదం అన్నిటినీ ఆహ్వానించగలిగిన ఉదారవాదం ఉండిందనిపిస్తుంది. ఈ దశకు గల ముఖ్య లక్షణాలుగా, జ్వలించే మేథో జిజ్ఞాస, అలుపెరుగని ఊహాత్మకత, ఆలోచనల వివిధ సంభావ్యత, పర్సపర వ్యతిరేకంగా ఉన్న తాత్విక దర్శనాల మధ్య సఖ్యత, కండ బలం కంటే బుద్చధి బలంతో చర్చల ద్వారా బలా బలాల నిర్ణయాత్మకత, స్వీయ పరిశీలన వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా వీళ్ళు సత్యానికున్న సంక్లిష్ట స్వభావాన్ని, చలన శీల స్వభావాన్నిగుర్తించలేమనీ ఇది ఇంతే ఉంటుంది అని కచ్చితమైన నిర్దారణ చేయలేమని గుర్తించారనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రతిపాదన నిజమని నిర్దారణ అయిందనుకున్నా దానికి షరతులు వర్తిస్తాయనే స్పృహ వారికి ఉందని తెలుస్తుంది.
ఈ ధోరణి అప్పటి నాగరికతల్లో అంతా కనిపిస్తుంది. ఎక్కడా కూడా మతాధికారి లేదా రాజు జోక్యం మనిషి ఆలోచనమీద లేదనిపిస్తుంది. ఆ తాత్విక సంశయవాద దశలో(Axial age) రాజ్యం నుంచి వేధింపులు ఎదుర్కున్న మొట్ట మొదటి బాధితుడు సోక్రటీసు అని చెప్పవచ్చు. ఆయన కాక ఇంకెవరైనా ఉన్నారేమో చరిత్రను జాగ్యత్తగా వెతకాలి.
Your comments pls
విరించి విరివింటి.